Thursday, November 19, 2009

పెద్దక్క పెళ్లిచూపులు

నా మొదటి పెళ్ళిచూపుల గురించి టపా రాస్తున్నప్పుడే అమ్మమ్మ వాళ్ళింట్లో జరిగిన మొదటి పెళ్ళిచూపుల గురించి అమ్మ చెప్పిన కబుర్లు గుర్తొచ్చాయి.. వాటి గురించి ఇప్పుడు. ఇంట్లో ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారంటే, ఇంటాయన (అంటే ఇంటి ఓనరు కాదు, ఇంటి పెద్ద) పట్టించుకోక పోయినా చుట్టాలూ, స్నేహితులూ ఆ పిల్లలకి సంబంధాలు చూడడం, ఉచిత సలహాలు ఇవ్వడం వాళ్ళ బాధ్యతగా భావిస్తారు కదా.. అలా ఇంట్లో చివరి పిల్లలు ఇంకా బళ్లోకి వెళ్తుండగానే పెద్దమ్మాయికి పెళ్ళిసంబంధాలు రావడం మొదలయ్యాయి.

అమ్మ అప్పటికి హైస్కూలికి వెళ్తోంది.. పిన్నిలిద్దరూ, మామయ్య ఎలిమెంటరీ స్కూల్. పెద్ద పెద్దమ్మ, అంటే అమ్మ వాళ్ళ పెద్దక్కని చదువు మానిపించేశారు. పెద్ద పిల్లకి పెళ్లి చేసేయాలని అమ్మమ్మ తొందర పడుతున్నా, తాతగారు అస్సలు పట్టించుకోకుండా పనులు చూసుకుంటున్న సమయంలో బంధువులెవరో అమ్మమ్మ పాలిట దేవుళ్ళలా వచ్చి ఓ సంబంధం తెచ్చారు. ఫలానా రోజున పెళ్ళివారు అమ్మాయిని చూసుకోడానికి వస్తారు అని కబురొచ్చింది.. ఇంకేముంది.. ఇల్లంతా హడావిడి.

ఇంటి నిండా ఉన్న పిల్లల్ని చూసి, వచ్చిన వాళ్ళు హడిలి పోతారనుకున్నారో లేకపొతే పిల్లలందరినీ పరిచయం చేయడం ఎందుకనుకున్నారో, అమ్మమ్మ తాతగారు పిల్లలెవరూ పెళ్లివారుండగా బయటికి రాడానికి వీల్లేదని ఆర్డరేశారు. పాపం ముందు రోజు ఒళ్ళు హూనంయ్యేలా ఇల్లంతా సర్దింది వీళ్ళే కాని, అసలు ముఖ్యమైన పెళ్ళిచూపుల ఘట్టం వచ్చేసరికి సైడైపోవాల్సి వచ్చింది. తాతగారు సున్నితంగానూ, పెద్ద మావయ్య ఘాటుగానూ మరోసారి గుర్తు చేశారు పిల్లలందరికీ, ఎత్తి పరిస్థితుల్లోనూ పెళ్లి వాళ్ళుండగా బయటికి రావొద్దని.

పెళ్ళికూతురిని వంటింట్లో తన దగ్గర ఉండమని, మిగిలిన పిల్లలందరినీ వెనుక గదిలో ఉండమని చెప్పింది అమ్మమ్మ. పిల్లలంతా వెనుక గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరో వచ్చిన అలికిడి, తర్వాత తాతగారు, పెద్ద మావయ్యల హడావిడి వినబడుతున్నాయి. అమ్మ వాళ్ళ మూడో అక్క, నాలుగో అక్కలకి కుతూహలం మొదలయ్యింది.. అవతలి గదిలో ఏం జరుగుతో ఉండి ఉండొచ్చో గుసగుసగా ఊహాగానాలు చేస్తున్నారు పిల్లలందరూ. ఇద్దరక్కలూ కూడబలుక్కుని ఒక ప్లాన్ వేశారు.

పిల్లలున్న గదిలోనే ఒక మూలకి నిచ్చెన ఉంది. ఆ నిచ్చెనని మధ్య గోడకి ఆన్చి పైకి ఎక్కితే గోడ అవతల గదిలో జుర్గుతున్న పెళ్లిచూపుల తతంగమంతా చూడొచ్చు. ప్లాన్ విని మొదట భయ పడ్డ పిల్లలంతా ఏం జరుగుతోందో అన్న కుతూహలం కొద్దీ ఆ ప్రకారం ముందుకు పోడానికి సరే అనేశారు. చప్పుడవకుండా నిచ్చెనని తెచ్చి గోడకి ఆన్చి వేశారు. ఇద్దరు పిల్లలు నిచ్చెన పట్టుకోగా మొదట మూడో అక్క నిచ్చెన ఎక్కి అవతలి గదిలోకి తొంగి చూసింది.

అక్కడ కనిపించిన దృశ్యం ఏమిటంటే తాతగారు, పెద్ద మావయ్య తో పాటు మరో ఆయన కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయన జుట్టు సగం నెరిసిపోయింది. "పెళ్ళికొడుకు బాగా ముసలాడే" అని ప్రకటించింది ఆమె నిచ్చెన దిగి. పిల్లలంతా బోల్డంత నిరాశ పడ్డారు. ఎలాంటి వాడైనా పెళ్లి కొడుకు కదా.. చూడక తప్పదు కదా.. ఒక్కొక్కరుగా నిచ్చెన ఎక్కడం, తొంగి చూసి దిగిపోవడం.

ఇక చివరికి మిగిలింది ప్లానేసిన నాలుగో అక్క. ఆమెకూడా నెమ్మదిగా నిచ్చెన ఎక్కి తొంగి చూస్తూ, సరిగ్గా అదే సమయానికి ఎందుకో తల పైకెత్తిన పెద్ద మావయ్యకి దొరికి పోయింది.. తర్వాత పెద్దమావయ్య ఏం చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. ఇంతకీ ఆ వచ్చినతను పెళ్ళికొడుకు కాదు.. పెళ్ళివారికి వీలవక వాళ్ళ బంధువుని చూసి రమ్మని పంపించారుట.

Tuesday, November 17, 2009

నాయికలు-కిరణ్మయి

చదివిన చదువును జీవితానికి అన్వయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కొందరి కోవకి వస్తుంది కిరణ్మయి. ఆమె మనస్తత్వ శాస్త్రం లో పీజీ చేసింది. ఊహించని కష్టం వచ్చి పడినప్పుడు, అందమైన పొదరిల్లు లా ఉండాలని తను కోరుకున్న తన వైవాహిక జీవితం పునాది దశలోనే కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మనస్తత్వ శాస్త్రాన్నే తనకి ఆసరాగా చేసుకుంది కిరణ్మయి. పోలీసులకి దీటుగా అపరాధ పరిశోధన చేసి తన భర్తని రక్షించుకుంది. ఈ క్రమంలో 'లేడీస్ హాస్టల్' లో జరుగుతున్న అక్రమాలెన్నింటినో వెలుగులోకి తెచ్చింది.

కిరణ్మయిది విచిత్రమైన కుటుంబం. ఉద్యోగం నుంచి సస్పెండైన తండ్రి, ఇంటి బాధ్యత పట్టించుకోని అన్నలు. ఇంట్లో రాజకీయాలు చేసే వదినలు. ఏ ఇద్దరి మనుషుల మధ్యా అనుబంధం లేదా ఇంట్లో. 'తన' ఇల్లు అలా ఉండకూడదని కిరణ్మయి కోరిక. ఆమెకి పెళ్లి చేయడం కన్నా ఉద్యోగానికి పంపితే తనకి వెసులుబాటుగా ఉంటుందని ఆలోచిస్తాడు ఆమె తండ్రి. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకో పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి కొడుకు రంజీ క్రికెట్ ప్లేయర్.. పేరు రాయన్న. ఆమె కన్నా తక్కువ చదువుకున్నాడు. అయినా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది.

మనస్తత్వ శాస్త్రం ఆధారంగా మొదటి రాత్రి తన భర్తని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది కిరణ్మయి. తన ఆశ, శ్వాస క్రికెట్టే అనీ, భారత జట్టుకి ఎంపికవ్వాలన్నది తన ధ్యేయమని రాయన్న చెప్పినప్పుడు, "రెండేళ్ళ పాటు ఉద్యోగం మానేసి ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టండి.. ఈ రెండేళ్ళూ నేను ఉద్యోగం చేస్తాను.." అంటుంది, అప్పటివరకూ క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని కిరణ్మయి. ఆమెతో తన జీవితం బాగుంటుందన్న నమ్మకం లుగుతుంది రాయన్నకి. తనకి ఏ అమ్మాయితోనూ శారీరక సంబంధం లేదని భార్యకి చెబుతాడతను. అమ్మాయిలు వచ్చి ఆటోగ్రాపులు తీసుకుంటారనీ, అంతకు మించి ఎవరితోనూ పరిచయం లేదనీ చెబుతాడు.

రాయన్నతో జీవితం తను కోరుకున్నట్టుగా ఉండబోతోందన్న నమ్మకం కిరణ్మయి కి కలుగుతున్న సమయంలోనే తలుపు చప్పుడవుతుంది. అర్ధరాత్రి వేళ వచ్చిన పోలీసులు రాయన్న ని అరెస్టు చేస్తారు.. లేడిస్ హాస్టల్ లో ఉంటున్న అపురూప లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్యకి కారణమయ్యాడన్న అభియోగంపై. "నాకే పాపమూ తెలీదు.. కనీసం నువ్వైనా నమ్ము" అని భార్యకి చెప్పి పోలీసు జీపెక్కుతాడు రాయన్న. ఆ అర్ధరాత్రి వేళ తన మనో నిబ్బరం కోల్పోకుండా ఉండడం కోసం కిరణ్మయి చేసిన పని ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చోడం. ఆ మర్నాడే సెలక్షన్స్ కోసం పిలుపొస్తుంది రాయన్నకి.

అతనికి బెయిల్ ఇప్పించడం మొదలు సెలక్షన్స్ లో ఆడడానికి అతన్ని మానసికంగా సిద్ధం చేయడం వరకూ కిరణ్మయి చేసిన కృషి అసామాన్యమైనది. అతను సెలక్షన్స్ కి వెళ్ళగానే లాయర్ తో కలిసి భవిష్యత్ కార్యక్రమం ఆలోచించి, రాయన్న నిర్దోషి అని నిరూపించే ఆధారాలను వెతికే పనిలో పడుతుంది ఆమె. ఓ పక్క రాయన్న దోషి అని బలంగా నమ్ముతున్న పోలీసులు, మరోపక్క అతను నేషనల్ టీం లో సెలక్ట్ కాకూడదని పావులు కదుపుతున్న క్రికెట్ ప్రత్యర్ధులు, ఇంకోపక్క జరుగుతున్నా పరిణామాల వల్ల తనమీద తనకే నమ్మకం పోతున్న స్థితిలో ఉన్న రాయన్న.. కుటుంబ సభ్యులెవరూ సాయం చేయడానికి ముందుకు రాని నేపధ్యంలో పరిస్థితులతో పోరాటానికి సిద్ధపడుతుంది కిరణ్మయి.

రాయన్న భార్యగా కాక, ఓ విద్యార్ధిని గా హాస్టల్లో చేరిన కిరణ్మయికి రాయన్నని అనుమానించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఓ పక్క రాయన్నకి కావాల్సిన మనో ధైర్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే, అతని నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు సేకరించడం మొదలు పెడుతుంది కిరణ్మయి. రాయన్న అపురూపలక్ష్మికి 'కొంత' సన్నిహితుడన్న విషయం తెలిసినప్పుడూ, ఆ అమ్మాయి రాయన్నని ప్రేమించిందన్న నిజం బయట పడినప్పుడు కలత చెందుతుంది కిరణ్మయి. అంతమాత్రాన తన బాధ్యతని మరచిపోదు. హాస్టల్ అమ్మాయిలతో స్నేహం చేసి జరిగినదేమిటో తెలుసుకుంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ నవల 'లేడీస్ హాస్టల్' చదివిన ప్రతి ఒక్కరినీ చాలా రోజులపాటు వెంటాడే పాత్ర కిరణ్మయి. తనదైన శైలిలో ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు యండమూరి.

ప్రతి అంశాన్నీ తనదైన దృక్కోణం నుంచి ఆలోచించడం, మానసికంగా బలహీనమైనప్పుడు సైతం ఆలోచనల్లో లాజిక్ ని విడిచిపెట్టక పోవడం కిరణ్మయి ప్రత్యేకత. చివరి ఆధారం దొరికే వరకూ రాయన్న నేరం చేసే ఉండొచ్చన్న ఆలోచన ఏమూలో గుచ్చుతూనే ఉంటుంది ఆమెని. వైవాహిక జీవితాన్ని గురించి సంతోషంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపాటులా అనిపించే భర్త అరెస్టు మొదలు, ఇంటా బయటా అతనిపై వచ్చిన నిందలు, చుట్టూ ఉన్న మనుషుల నిజ స్వరూపాలు మరోసారి బహిర్గతం అవడం వల్ల కలిగే శూన్యత.. వీటన్నింటినీ ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించిన కిరణ్మయి ని అభినందించకుండా ఉండలేం. ('లేడీస్ హాస్టల్,' రచన: యండమూరి వీరేంద్రనాథ్, 'నవసాహితి' ప్రచురణ, వెల రూ. 70, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

Sunday, November 15, 2009

సుమన్ బాబు

ఉదయాన మగత నిదుర చెదిరిపోయిన వేళ 'ఈనాడు' చూసి ఉలిక్కి పడ్డాను.. 'ఈనాడు' అంటే కమల్ హాసన్-వెంకటేష్ బాబు సినిమా కాదు.. దిన పత్రిక. ఉలికిపాటుకి కారణం సినిమా పేజీలో 'నాన్ స్టాప్' వినోదం హెడ్డింగ్ తో వచ్చిన వార్త. ఇన్నాళ్ళూ 'ఈటీవీ' సుమన్ గా మనందరికీ చిర పరిచితుడైన సుమన్ 'సుమన్ బాబు' గా మారాడన్నది ఆ వార్త చదివాక నాకు అర్ధమైన మొదటి విషయం. నిర్మాతల కొడుకులు, హీరోల కొడుకులు 'బాబు'లవ్వడం తెలుగు సినిమా పరిశ్రమలో మామూలు విషయమే కాబట్టి ఉలికిపాటు అందుక్కాదు.

భారీ పౌరాణిక చిత్రం 'ఉషాపరిణయం' తర్వాత, సుమన్ ప్రొడక్షన్స్ సంస్థ తన రెండో ప్రయత్నంగా నిర్మించిన 'నాన్ స్టాప్' సినిమా త్వరలో విడుదల కాబోతోందన్నది ఆ వార్త సారాంశం. బహుముఖ ప్రజ్ఞాశాలి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు, సంగీతం, దర్శకత్వం వంటి తెర వెనుక బాధ్యతలతో పాటు తెరపై నటించడం లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సుమన్.. సారీ సుమన్ బాబు.. ఈ సినిమాకి కేవలం నిర్మాత బాధ్యతను మాత్రమే తీసుకున్నారు. ఇంత షాకింగ్ వార్త తెలిశాక ఉలికి పాటు కలగదూ మరి??

సుమన్ బాబు సినిమాకి ఎవరో కథ, మరెవరో మాటలు, ఇంకెవరో పాటలు రాయడం, ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహించడం నాకస్సలు మింగుడు పడలేదు. సకల కళల సవ్యసాచి అయిన సుమన్ బాబు, అజ్ఞాత వాసం లో అర్జునుడు బృహన్నల వేషం వేసినట్టుగా ('ఉషాపరిణయం' లో తను కూడా బృహన్నల వేషం లో ఓ మెరుపు మెరిశాడు) ఇలా తన టాలెంట్స్ అన్నింటినీ దాచేసుకోవడం విధి చేయు వింత కాక మరేమిటి? కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమైతే ఏదో ఒకటి.. మహా అయితే రెండు బాధ్యతలను కొత్త వాళ్లకి ఇవ్వొచ్చు.. అంతేకానీ తను ఒకేఒక్క బాధ్యతకి పరిమితమైపోతే ఎలా??

అభిమానులంతా 'ఉషాపరిణయం' మొదటి రోజే చూశారంటే అందుకు కారణం తెరమీద, తెర వెనుక సుమన్ బాబు అన్నీ తానే అవ్వడం వల్లనే.. (తర్వాతి రోజు సినిమా ఉంటుందో ఉండదో అనే అనుమానం వల్ల.. కూడా అని కొందరు గిట్టని వాళ్ళు గొణుగుతున్నారు కానీ అవన్నీ పట్టించుకోనవసరం లేదు) మరిప్పుడు సుమన్ బాబు కేవలం నిర్మాత పాత్రకే పరిమితమైతే ఈ సినిమా చూడాలనిపిస్తుందా? సాంకేతిక వర్గం మాత్రమే కాదు, నటీనటులు కూడా అందరూ కొత్తవాళ్ళేట.. అనుభవజ్ఞుడైన సుమన్ కూడా నటించి ఉంటే వాళ్లకి ఎంత ఉత్సాహం గా ఉండేది? అతన్నుంచి వాళ్ళు ఎన్ని విషయాలు నేర్చుకుని ఉండేవాళ్ళు?

మానవుడు ఆశాజీవి కాబట్టి, నేను కూడా మానవుడినే కాబట్టి నాకో ఆశ కలుగుతోంది. పేపర్లో వేసిన ఫోటోలో సుమన్ బాబు కొత్త గెటప్ లో కనిపించాడు.. నిజం చెప్పాలంటే కొంచం ఒళ్ళు చేసిన శ్రీకాంత్ లా అనిపించాడు. (శ్రీకాంత్ అభిమానులూ.. ఇది కేవలం అభిమానం తో చెబుతున్న మాట) బహుశా 'నాన్ స్టాప్' లో తను ఏదైనా 'ప్రత్యేక' పాత్ర పోషించి ఉండొచ్చేమో కదా.. ఆ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచుతారేమో.. కేవలం నా ఊహాగానమే సుమా.. నిజమైతే బాగుండును కదా..

అన్నట్టు 'నాన్ స్టాప్' సినిమా కి కామెడీ అనే ఉప శీర్షిక ఉందిట.. టైటిల్స్ లో సుమన్ బాబు పేరుండగా ఇంక కామెడీ అని ప్రత్యేకంగా చెప్పాలా? కొత్త దర్శకుడి పిచ్చితనం కాకపొతే.. కామెడీ తో పాటు సస్పెన్స్ కూడా ఉంటుందిట సినిమాలో.. సుమన్ బాబు తెర మీద కనిపిస్తాడో లేదో అన్న సస్పెన్స్ ఉండనే ఉంది కదా. తెలుగు తో పాటు తమిళంలోనూ విడుదల చేస్తారుట. ఇలా రెండు భాషల్లో సినిమా నిర్మించడం నిర్మాత పరిణతి కి నిదర్శనం కాదూ?

ఇంద్రనాగ్ అనే కుర్రాడు స్క్రీన్ ప్లే రాశాడుట. ఇంకా క్రియేటివ్ డిజైనర్, ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు కూడా చూశాడుట. ఈటీవీ లో చూసిన ముఖమే.. విధి విలాపం వల్ల ప్రభాకర్ దూరమయ్యాక, ఇప్పుడా పాత్ర(ల)ని తనే పోషిస్తున్నాడుట ఈ కుర్రాడు.. అంటే సుమన్ బాబు రాముడైతే ఇతను సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అన్నమాట. ఆడియో వచ్చే శనివారం వస్తుంది.. సినిమా కోసం మాత్రం మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Friday, November 13, 2009

పోలిస్వర్గం

దీపావళి బాణాసంచా అంతా ఆనందంగా కాల్చేసి భోజనం కానిచ్చి ముసుగుతన్ని పడుకున్నానా.. అసలే చలికాలం అవడం వల్ల వెంటనే నిద్ర పట్టేసిందా.. బుగ్గ మీద చల్లటి చెయ్యి తగలడం తో మెలకువ వచ్చేసింది. అప్పుడు నాకు ఏడేళ్ళు. ఆ చెయ్యి అమ్మది. అమ్మేమీ మాట్లాడకుండానే నాకు విషయం అర్ధమయిపోయింది. కప్పుకున్న దుప్పటినే నెత్తి మీదనుంచీ ముసుగులా వేసుకుని, ఓ చేత్తో చివర్లో ఇత్తడి తొడుగు తొడిగిన పేద్ద కర్రా, మరో చేత్తో లంతరూ పట్టుకుని బయలుదేరాను. నా వెనుక పూజ సామాన్ల బుట్టతో అమ్మ.

చప్పుడవకుండా తలుపు దగ్గరగా వేసి, ఇంటి ముందు రోడ్డు దాటగానే చెరువు. చెరువు గట్టు మీద మెట్లలా పరచిన రాళ్ళ మీద కర్ర చప్పుడు చేసుకుంటూ నేను.. లాంతరు వెలుగులో నా వెనుక జాగ్రత్తగా నడుస్తూ అమ్మ. అమ్మని ఒక నిమిషం ఆగమని సైగ చేసి, నేను చివరి మెట్టు వరకూ దిగి, కర్రతో రాళ్ళు తట్టి, నీళ్ళని రెండు మూడు సార్లు కదిపి, గట్టు మీదకి వచ్చి కూర్చున్నాను. మెట్ల మీద పాములేవైనా నిద్ర పోతూ ఉంటే ఆ చప్పుళ్ళకి చెర్లోకి వెళ్లిపోతాయన్న మాట.

నేనేమో చలికి పళ్ళు కొరుక్కుంటూ గట్టు మీద కూర్చున్నానా, అమ్మ 'కార్తీక దామోదరుడా.. మోక్షగుండ దామోదరుడా.. ' అనుకుంటూ నీళ్ళలోకి దిగి, మూడు మునకలు వేసి, తడి చీరతో గట్టు మీదకి వచ్చి లాంతరు వెలుగులో పూజ మొదలు పెట్టేస్తుంది. నేను కునికి పాట్లు పడుతూనే అమ్మ 'నైవేద్యంబిదిగో..' పాడేస్తుందేమో అని ఒక చెవి అటు వేసి ఉంచడం. ముందు రోజు సాయంత్రమే సంపాదించి పెట్టుకున్న అరటి దొప్పలో దీపం వెలిగించి అమ్మ ఆ పాట పాడుతూ గంట వాయించేస్తుందన్న మాట.

మరి నాకేంటి లాభం? అంటే.. ఉంది కదా.. ఇంట్లోనుంచి జాగ్రత్తగా తెచ్చిన చిన్న బెల్లం ముక్కని తమలపాకులో నైవేద్యం పెట్టేది దేవుడికే అయినా, 'ప్రసాదం' ఆరగించేది నేనే కదా.. నల్లటి చెరువు మీద తెల్లటి మంచు కురుస్తూ ఉంటుందా.. అరటి దొప్పలో వెలిగించిన దీపం మెరుస్తూ నీళ్ళలోకి వెళ్తుంటే ప్రసాదం చప్పరిస్తూ చూడడం భలేగా ఉంటుంది.. చెరువులో చేపలు దీపాన్ని ఎక్కువ దూరం వెళ్ళనివ్వవు.. దీపాన్ని తినడానికి ప్రయత్నించి ఆర్పేస్తాయి.. తప్పు తప్పు.. దీపం కొండెక్కిపోయింది అనాలి. దీపం కొండెక్కే వరకూ ఉండి, అప్పుడు ఇంటికి వెళ్ళాలి మేము. అది మొదలు కార్తీక మాసం నెల్లాళ్ళూ దిన చర్య ఇలాగే ఉండేది చిన్నప్పుడు.. అంటే నా ఐదో ఏటి నుంచి దాదాపు పదేళ్ళు.

ప్రసాదం ఒక్కటేనా? తెల్లవారు జామునే అమ్మకి సాయం వెళ్లాను కాబట్టి మరో అరగంటో, గంటో ఆలస్యంగా లేవొచ్చు. ప్రసాదం తో పాటు క్షీరాబ్ది ద్వాదశి కి, పున్నమికి, పోలిస్వర్గానికి ఐదేసి పైసల చొప్పున దక్షిణ కూడా దొరికేది. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించేది అమ్మ. పున్నమికి అయితే ఇంటి పక్కనే జ్వాలా తోరణం జరిగేది. అంటే ఒక పేద్ద వెంటిని (ఎండుగడ్డి తో పేనిన లావుపాటి తాడు) తోరణంలా కట్టి వెలిగించి, మంటల్లోనుంచి దేవుడి పల్లకితో పాటు మూడు సార్లు 'హర హర మాహాదేవ' అంటూ తిరగాలన్న మాట. ఈ కార్యక్రమం రాత్రి పూట చంద్ర దర్శనం అయ్యాక జరుగుతుంది.

పున్నమి స్పెషల్ చలివిడి. అమ్మ ఉపవాసం ఉండి పిండి కొట్టి చలివిడి చేసుకునేది.. సారెల్లో పంచి పెట్టే చలివిడి కన్నా ఈ చలివిడి చాలా రుచిగా ఉండేది. కొంచం పెద్ద క్లాసుల్లోకి వచ్చాక కార్తీక మాసం నుంచి మరిన్ని లాభాలు పొందొచ్చని తెలిసింది. మామూలుగానే నాకు చిన్నప్పుడు సోమవారం బడికి వెళ్ళాలంటే భలే చిరాగ్గా ఉండేది.. ఆదివారం అంతా ఆటల్లో గడపడం వల్ల సోమవారం కూడా ఇంట్లో ఉండి పోవాలనిపించేది. కార్తీక మాసం ఐతే 'అమ్మా నేను కూడా ఉపవాసం ఉంటానమ్మా..' అంటే చాలు అమ్మ నా భక్తికి బోల్డంత మురిసిపోయి అయితే ఇవాళ బడి మానేయ్ అని అడక్కుండానే పర్మిషన్ ఇచ్చేసేది. హైస్కూలుకి వచ్చాక అమ్మకి కొంచం మస్కా కొట్టి దక్షిణ రోజూ ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నాను. అంటే రోజూ ఐదు పైసలన్నమాట.

మొదటి వారంలో ఉదయాన్నే లేవడం కొంచం ఇబ్బందిగా ఉండేది కానీ, త్వరలోనే అలవాటైపోయేది. ముఖ్యంగా అమ్మ చెర్లోకి వదిలిన కార్తీక దీపాన్ని ఎంతసేపైనా చూడాలనిపించేది. కార్తీక మాసానికి అలవాటు పడేలోగానే 'పోలిస్వర్గం' వచ్చేసేది.. అంటే మరేమిటో కాదు కార్తీక అమావాస్య. ఆరోజు తెల్లవారు జామున మా వీధి మహిళలంతా పిల్లలని తోడు తీసుకుని స్నానానికి వచ్చే వాళ్ళు, చెరువుకి. వాళ్ళంతా స్నానం, పూజ లో ఉంటే మేమంతా చలిమంటలు వేసుకునే వాళ్ళం. ఓ పక్క పూజలు అవుతుండగానే ఎవరి ప్రసాదం ఏమిటో ఎంక్వయిరీలు చేసుకునే వాళ్ళం.

పోలిస్వర్గం రోజున ఒక్కొక్కరూ రెండు మూడు రకాల ప్రసాదాలు పెట్టేవాళ్ళు. అరటిపండు ముక్కలు, జాంపండు ముక్కలు ఇలా అన్నమాట.. ఇక చలివిడి, వడపప్పు సరేసరి. పిల్లలందరం రాజ్యంగారి ప్రసాదం కోసం ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళు కొంచం గొప్పవాళ్ళన్న విషయం ఆవిడ ఎప్పుడూ గుర్తు పెట్టుకునేవారు. అందుకే ప్రసాదాలు కూడా అందర్లా కాకుండా యాపిల్ ముక్కలు, కమలా ఫలం తొనలు ఇలా కొంచం ఘనంగా ఉండేవి. అంతేనా.. ఆవిడ దక్షిణ పది పైసలు మొదలు పావలా వరకూ ఉండేది, తీసుకునే పిల్లల వయసును బట్టి.

మిగిలిన రోజుల్లా కాకుండా, పోలిస్వర్గం రోజున ఒక్కొక్కరూ ముప్పై కి తక్కువ కాకుండా దీపాలు వదిలేవాళ్ళు. చెరువంతా భలే మెరిసిపోయేది దీపాలతో. పూజ అయ్యాక ఒక కథ చెప్పుకుని అప్పుడు దీపాలు వదిలేవాళ్ళు. ఆ కథ ఏమిటంటే ఒక ఊళ్ళో ఓ మడేలమ్మ ఉంటుంది. ఆవిడకి బోల్డంత భక్తి. కార్తీక మాసం నెల్లాళ్ళూ తెల్లవారు జామునే దగ్గర్లో ఉన్న నదికి వెళ్లి స్నానం చేసి, దీపం వదిలి ఇంటికి వచ్చేది. అయితే ఆవిడ చాలా గయ్యాళి. తన కోడలు 'పోలి' కి కూడా యెంతో భక్తి ఉన్నా, ఆ అమ్మాయిని స్నానానికి తీసుకెళ్ళేది కాదు. అత్తగారికి ఎదురు చెప్పలేక పోలి బోల్డంత బాధ పడేది.

అమావాస్య రోజున అత్తగారు స్నానానికి వెళ్ళాకా, ఒక్క రోజు కూడా దీపం వదల్లేక పోయానే అని పోలి బోల్డంత బాధ పడి, ఇంట్లోనే స్నానం చేసి, వంటింట్లో కవ్వం చివర ఉన్న వెన్నతో దీపం వెలిగించి ఊరందరి బట్టలూ ఉతికే మట్టి బాన లో నీళ్ళు నింపి అందులో దీపం వదులుతుంది. వెంటనే దేవుడు విమానంలో వచ్చి 'పోలీ నీ భక్తి కి మెచ్చాను.. స్వర్గానికి తీసుకెళ్తాను' అంటాడు. అప్పుడే నది నుంచి వచ్చిన అత్తగారు అడ్డుపడి 'మరి నేను రోజూ దీపం వదిలాను కదా' అని వాదిస్తుంది. అప్పుడు దేవుడు 'నాకు భక్తి ప్రధానం.. పోలి భక్తితో వదిలిన దీపమే గొప్పది..' అని చెబుతాడు. అప్పుడు పోలి 'మా అత్తగారిని కూడా తీసుకొస్తేనే నేను స్వర్గానికి వస్తాను' అంటుంది. దేవుడు వాళ్ళిద్దరినీ స్వర్గానికి తీసుకెళ్తాడన్న మాట.

ఈ కథ చెప్పి అమ్మ, అమ్మ ఫ్రెండ్సు అత్తగార్లు ఎన్ని బాధలు పెట్టినా కోడళ్ళు వాళ్ళ మంచే కోరతారు అని జోకులు వేస్తే, రాజ్యం గారిలాంటి వాళ్ళు తిరిగి ఏదో సమాధానం చెప్పేవాళ్ళు. మేమేమో 'మన గుర్రమ్మని వాళ్ళ కోడలే స్వర్గానికి తీసుకెళ్లాలన్న మాట' అనుకునే వాళ్ళం. 'అంబ నీకిదిగో హారతీ..' 'క్షీరాబ్ది కన్యకకు..' లాంటి పాటలు పాడి అప్పుడు దీపాలు వదిలేవాళ్ళు.

ఆవేళ బళ్ళో మేము ఎవరికి ఎవరు ఎన్ని డబ్బులిచ్చారో లెక్కలేసుకునే వాళ్ళం. నాకోసారి పోలిస్వర్గం కథ విన్నాక ఓ డౌటు వచ్చింది. ఆడ వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళారు సరే.. మరి వాళ్ళింట్లో మగవాళ్ళకి స్వర్గం వద్దా? అని. ఇంటికొచ్చాక అమ్మని ఈ డౌట్ అడిగితే, నాన్న విని 'అత్తా కోడలూ స్వర్గానికి వెళ్ళిపోతే మగాళ్ళకి ఇంక ఇల్లే స్వర్గం..' అన్నారు. ఆ జోకు అర్ధం కావడానికి మరి కొన్నేళ్ళు పట్టింది నాకు.

Thursday, November 12, 2009

పిల్లల పండుగ

రెండు రోజుల్లో బాలల దినోత్సవం వచ్చేస్తోంది. మన నాయకులకి నెహ్రూనీ, ఆయన వారసులనీ ఘనంగానూ, పిల్లలని కంటి తుడుపుగానూ తల్చుకోడానికి ఓ అవకాశం వస్తోంది. బొత్తిగా పిల్లలకోసం ప్రభుత్వం ఏమీ చేయడం లేదని జనం అనుకోకుండా పిల్లల కోసమని రాష్ట్ర రాజధానిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరపడానికి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మరి ఆ సినిమాలు చూడడానికి అవకాశం లేని పిల్లల కోసం ప్రభుత్వం ఏమీ చేయనట్టే కదా.. అని అడక్కూడదు. ఆరోజు స్కూళ్ళకి సెలవు ఇస్తోంది.. ఇంకేం కావాలి??

అసలు పిల్లల కోసం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే పిల్లలే భవిష్యత్తు కాబట్టి. మన ఇంటికైనా, మన దేశానికైనా భవిషత్తు పిల్లలే కదా. మరి పిల్లల కోసం ఆలోచించడం అంతే రేపటి రోజు కోసం ఆలోచించడమే కదా? మన పిల్లలకోసం మనం ఆలోచిస్తున్నట్టే, మొత్తం అందరు పిల్లల గురించీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా మరి? ఆలోచించడం అంతే, 'బడి బాట' 'మళ్ళీ బడికి' లాంటి పేరు గొప్ప ప్రోగ్రాములు ప్రకటించి ఊరుకోవడమేనా? వాటి అమలు సంగతి పట్టించుకోవాలా, వద్దా?

అక్షరాస్యత లాంటి విషయాల్లో వెనుకబడిఉన్న ఆంధ్ర దేశం, బాలకార్మికుల సంఖ్య విషయంలో మాత్రం ముందుంది. చవకగా దొరికే కూలీలు, చెప్పిన పని కిమ్మనకుండా చేస్తారు, ఇచ్చింది పుచ్చుకుంటారు, పెద్దల యందు ఉండే భయం వల్ల జాగ్రత్తగా పని చేస్తారు.. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే కాబోలు పొలాల్లోనూ, ఫ్యాక్టరీల్లోనూ, చివరికి ఇళ్ళలో కూడా చిన్న పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. పిల్లలు పని చేస్తున్నారు అంటే, కేవలం వయసుకు మించి శ్రమ పడుతున్నారు అని మాత్రమే కాదు.. భవిష్యత్తు అనేది లేకుండా చేసేసుకుంటున్నారు కూడా. చదువనేదే లేకపోవడం వల్ల వాళ్లకి ఎప్పటికీ కూలి పని తప్ప మరో ప్రత్యామ్నాయం దొరకదు కదా..

బాలకార్మిక వ్యవస్థని రూపుమాపడం కోసం ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఎందుకు విజయవంతం కావడం లేదు? రెండు కారణాలు కనిపిస్తాయి. పథక రచనలో పొరపాట్ల కారణంగా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనిపిస్తుంది. పిల్లలు పనికి వెళ్లడానికి మూల కారణం పేదరికం. తల్లిదండ్రుల సంపాదన కుటుంబం గడవడానికి సరిపోకపోవడం. ఇంకొంచం లోతుకి వెళ్తే తండ్రి సంపాదన తాగుడుకి పోగా, కేవలం తల్లి సంపాదనతోనే కుటుంబం గడవాల్సి రావడం. అసలు జబ్బుకి చికిత్స చేయకుండా పైపైన మందు పూయడం వల్ల రోగం పూర్తిగా తగ్గదు కదా. పోనీ ఆ మందైనా సక్రమంగా పూస్తున్నారా అంటే, పథకాల అమలులో వైఫల్యాలు బోల్డన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా జవాబుదారీ తనం కనిపించదు.

ప్రతి విషయానికీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమేనా? మనం ఏమీ చేయలేమా?? కచ్చితంగా చేయగలం. పనిమనిషి పిల్లలు వాళ్ళమ్మ వెనుక వచ్చి మనింట్లో పని చేయకుండా మనం ఆపగలం. మన వీధి చివర టీకొట్లో చిన్న పిల్లాడు టీలు అందిస్తుంటే, అతన్ని మానిపించే వరకూ ఆ కొట్టుకి రానని చెప్పగలం. ఏదైనా షాపులో చిన్న పిల్లలని పనిలో చూస్తే, ఆ యజమానితో మాటకలిపి మాటల మధ్యలో పిల్లలని పనిలో పెట్టుకుంటే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పెడతారని చెప్పగలం. పని మానేసిన పిల్లలు బడికి వెళ్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించగలం. వీటన్నింటితో పాటు ప్రభుత్వం చేత పని చేయించడానికి ఏదైనా మార్గమూ ఆలోచించగలం. ఇదంతా స్వార్ధానికి అతీతంగా కాదు.. రేపటి రోజు బాగుండాలనే స్వార్ధం తోనే..

Tuesday, November 10, 2009

నవ్వినా కన్నీళ్ళే..

ఒకటి కాదు.. రెండు కాదు.. పద్దెనిమిదేళ్ళ నా నిరీక్షణ ఫలించింది. అవును 'నవ్వినా కన్నీళ్ళే..' అనే నవల కోసం నేను అక్షరాలా పద్దెనిమిదేళ్ళు ఎదురు చూశాను.. ఎన్నో చోట్ల వెతికాను.. యెంతో మందిని అడిగాను. చివరికి చాలా యాదృచ్చికంగా నిన్న సాయంత్రం నా కంట పడింది ఈ పుస్తకం. ఇంతకీ ఏమిటీ నవల ప్రత్యేకత? సమాధానం ఒకే ఒక్క మాట.. ఈ నవల ఆధారంగానే 'సీతారామయ్య గారి మనవరాలు' అనే సినిమా తీశారు.

మొదటిసారి సినిమా చూడడం పూర్తవ్వగానే నేను చేసిన మొదటి పని కథ ఎవరిదీ అని ఎంక్వయిరీ చేయడం. 'మానస' రాసిన 'నవ్వినా కన్నీళ్ళే..' నవల ఆధారం గా సినిమా తీశారని తెలిసింది. అది మొదలు ఆ నవల చదవాలని ప్రయత్నం. ఆ నవల 'ఆంధ్ర ప్రభ' లో ప్రచురించారని తెలిసి ఆ దిశగానూ ప్రయత్నాలు చేశాను..ప్చ్.. దొరకలేదు. గత పద్ధెనిమిదేళ్ళలోనూ సినిమాని వందల సార్లు (అక్షరాలా కొన్ని వందల సార్లు) చూశాను.. టైటిల్స్ చూసిన ప్రతిసారీ ఒకటే అసంతృప్తి.. నవల చదవలేక పోయాను కదా అని..

నిన్న సాయంత్రం పుస్తకాల షాపుకి వెళ్లి, ముందుగా అనుకున్న రెండు పుస్తకాలూ తీసుకుని, కొత్తగా ఇంకేం వచ్చాయా అని చూస్తున్న సమయంలో బాపు కవర్ పేజీతో వచ్చిన ఓ బరువైన పుస్తకం నా దృష్టిలో పడింది. పుస్తకం పేరు 'మదర్పిత...తాంబూలాది...' కథల సంపుటం. రచన 'మానస' . బుర్రలో బల్బు వెలిగింది.. నేను వెతుకుతున్న మానస ఈ మానస ఒక్కరే అయితే తప్పకుండా 'నవ్వినా కన్నీళ్ళే..' గురించిన వివరం ఈ పుస్తకంలో దొరుకుతుంది.

ఓ పక్కగా నిలబడి ముందుమాట చదువుతూ, ఎగిరి గంతెయ్యాలనే కోరిక బలవంతంగా అణచుకున్నాను. ముందుమాట లోనే నాక్కావలసిన వివరం దొరికేసింది.. అంతే కాదు.. అదే పుస్తకం చివర్లో ఆ చిన్న నవలనీ జత చేశారన్న తీపి కబురు కూడా . తర్వాత నేను ఏంచేశానో వివరంగా రాయక్కర్లేదు.. ఓ నవలని సినిమాగా తీసినప్పుడు చాలా మార్పులు, చేర్పులు చేస్తారాన్ని విషయాన్ని బాగా గుర్తు చేసుకుని చదవడం మొదలు పెట్టాను.

కథానాయిక సమీర పాతికేళ్ళ అమ్మాయి. బెజవాడ లోని తాతగారింట్లో తన మేనత్త కూతురి పెళ్ళికి అమెరికా నుంచి వస్తుంది. పెళ్ళికూతురు మినహా మిగిలిన బంధువులంతా ఆమెని ఆహ్వానించడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తారు. మద్రాస్ విమానాశ్రయంలో ఆమెని రిసీవ్ చేసుకోడానికి వెళ్ళిన పెద్ద బావ సుందర్ ఇంటి పరిస్థితి అంతా వివరంగా చెబుతాడు సమీరకి.

తాతగారు పరంధామయ్య (ఈ పేరు సాహిత్యం లో మాత్రమే కనిపిస్తుంది) ఎనభై కి దగ్గర్లో ఉంటే బామ్మ అనసూయమ్మకి డెబ్బై దాటేశాయి. సమీర తలిదండ్రులు ఇండియా వదిలి వెళ్ళిపోడానికి కారణం ఆమె తండ్రి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వర్ణాంతర వివాహం చేసుకోవడమే. తాతగారు మనవరాలికి కుటుంబంలో కలుపుకోలేరు, ఆమె తల్లిది వేరే కులం అన్న కారణంగా..

బామ్మగారికి మాత్రం సమీరని సుందర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. ఇందుకోసం ఒక వృధా ప్రయత్నం కూడా చేస్తుంది ఆవిడ. సుందర్, అతని తమ్ముళ్ళ ప్రేమ కథలు, సమీర కాలేజీ లెక్చరర్ గా పనిచేయాలనుకోవడం, అక్కడి సమస్యలు, ఆమె మేనమామ రాజశేఖరం కుటుంబం.. ఇలా నవల్లో ఎన్నో కొత్త పాత్రలు, కొత్త సన్నివేశాలు ఉన్నాయి.

తాతయ్య-బామ్మ లతో మనవరాలి అనుబంధాన్ని రేఖామాత్రంగానే స్పృశించారు. అనసూయమ్మగారి హఠాన్మరణంతో యోగిగా మారిపోతారు పరంధామయ్యగారు. సమీర తలిదండ్రులు ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన ప్రమాదం లో మరణించారన్న నిజం సుందర్ కి తెలియడమే నవల ముగింపు. ఊహించినట్టుగానే నవలకీ, సినిమాకీ చాలా భేదం ఉంది. అయితేనేం.. ముందుమాటలో అవసరాల రామకృష్ణారావు చెప్పినట్టు 'నవ్వినా కన్నీళ్ళే..' నవల లేకపొతే 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా లేదు.

దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం రాసిన ఈ నవల అప్పట్లో 'ఆంధ్రప్రభ' నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి గెలుచుకుంది. 'మానస' అన్నది రచయిత ఉన్నవ వెంకట హరగోపాల్ కలం పేరు. స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన హరగోపాల్ తన భార్య 'మానస' పేరు మీద రాశారీ నవలని అప్పట్లో. ఈ నవలని సినిమా కథగా మార్చి యెంతో మందిని కలవడం, చివరికి క్రాంతికుమార్ సినిమా గా తీయడం, ఆనాటి తన అనుభవాలు, అనుభూతులు ముందుమాటలో రాసుకున్నారు రచయిత.

నాకైతే నవల చదువుతున్నంత సేపూ సినిమా కోసం కీరవాణి చేసిన నేపధ్య సంగీతం చెవుల్లో వినిపిస్తూనే ఉంది. దానికి తోడు మొన్నరాత్రే సినిమాని మరో సారి చూశాను, కాకతాళీయంగా.. ఈ నవలతో పాటుగా 'మదర్పిత..తాంబూలాది..' తో సహా నలభై కథలున్నాయి.. వాటన్నింటినీ చదవాల్సి ఉంది, వరుసగా... ('మదర్పిత..తాంబూలాది..' పేజీలు 422, వెల 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

Sunday, November 08, 2009

ఊరి చివరి ఇల్లు

హోరున కురిసే వర్షం.. చిమ్మ చీకటి.. ఊరికి దూరంగా ఉన్న ఒంటరి ఇల్లు.. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులు.. ఎవరికి ఎవ్వరూ ఏమీ కారు. ఆ రాత్రి వాళ్ళ జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందన్నదే దాదాపు యాభయ్యేళ్ళ క్రితం తిలక్ రాసిన 'ఊరి చివరి ఇల్లు' కథ. కవిత్వం లాగే కథలమీదా తనదైన ముద్ర వేసిన రచయిత తిలక్. వచనమైనా, కవిత్వమైనా భావుకత్వం ఆయన కలం నుంచి పరవళ్ళు తొక్కుతుంది. మానవ మనస్తత్వ చిత్రణ మీద తిలక్ కి ఉన్న పట్టు కి పరాకాష్ట ఈ కథ.

రమ ఓ పాతికేళ్ళ యువతి. ఆమెది ఓ బరువైన గతం. మూడు నెల్ల పసికందుని కోల్పోయిన గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ఇంత బాధ లోనూ ఆమె కళ్ళు 'విజయుడి' కోసం వెతుకుతూనే ఉన్నాయి. నిజానికి ఆ 'ఊరి చివరి ఇల్లు' రమ ది కాదు. ఆమె స్థితికి జాలిపడీ, తనకి పనికొస్తుందన్న ఆశ తోనూ ఆమెకి ఆఇంట్లో ఆశ్రయమిచ్చింది 'ముసిల్ది.' ఎందుకంటే జీవితపు చివరి రోజుల్లో తన బాగోగులు చూసే మనిషి కావాలి ముసిల్దానికి. రమ అందం, వయసు, అసహాయత చూశాక నమ్మకం కలిగింది, ఆమె తనని చూసుకోగలదని.

మన్నూ మిన్నూ ఏకమయ్యేలా వర్షం కురుస్తూనే ఉంటుంది బయట.. ఆ వర్షాన్ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది రమ. వర్షం ఆమెని గతంలోకి తీసుకు పోతుంది. 'ఆరోగ్యం పాడైపోతుంది పిల్లా.. శాలువా కప్పుకో..' అన్న ముసిల్దాని మాటలు లెక్క పెట్టదు రమ. వర్షానికి అడ్డం పడి రోడ్డున వెళ్తున్న నిలువెత్తు మనిషి ఉన్నట్టుండి రమ కంటపడతాడు, ఆ సంజెవేళ. వర్షంలో చిక్కుకుపోతాడేమో అన్న భయంతో అతన్ని ఇంటికి పిలుస్తుంది రమ. ఆజానుబాహుడైన అతనిలో తన 'విజయుడి' పోలికలు చూసి కలవర పడుతుంది. ఆ రాత్రి తన ఇంట ఉండి మర్నాడు ఉదయం రైలుకి వెళ్ళమంటుంది అతన్ని.

రమ కలవరపాటుని గుర్తిస్తాడతను. అతని పేరు జగన్నాధం. తనకంటూ ఎవరూ లేని జీవితం అతనిది. ఎక్కడా స్థిరంగా ఉండే మనస్తత్వం కాదు జగన్నాధానిది. అతని పట్ల యెంతో ఆదరం చూపుతుంది ముసిల్ది. వేడి వేడిగా వండి పెడుతుంది. పక్క సిద్ధం చేస్తుంది. రమ కూడా అతని పట్ల అభిమానంగా ఉంటుంది. అతను తన విజయుడేమో అన్న ఆశ ఏ మూలో మినుకు మినుకు మంటూ ఉంటుంది ఆమెకి. బయట వర్షం ఆగాగి కురుస్తూ ఉంటుంది.

ఓ రాత్రి వేళ తను గాఢ నిద్రలో ఉండగా రమ లాంతరుతో వచ్చి తన ముఖాన్ని పరిశీలనగా చూడడం గమనిస్తాడు, అప్పుడే మేల్కొన్న జగన్నాధం. ఆమెకి తన గతం చెబుతాడు.. ఇంట్లోనుంచి పారిపోయి సైన్యంలో చేరిన వైనాన్ని వివరిస్తాడు. 'విజయుడు కూడా సైన్యంలోకే వెళ్ళాడు' అంటుంది ఆమె. ఓ స్నేహితుడిని చూడడం కోసం అతని ఊరికి వెళ్లి, అతను చనిపోయాడని తెలిసి అక్కడ ఉండడానికి మనస్కరించక తిరుగు ప్రయాణంలో ఆ ఊళ్ళో, ఆమె ఇంట్లో ఎలా చిక్కుకు పోయాడో చెబుతాడు జగన్నాధం.

అతను తనకి దగ్గరవాడు గా అనిపించడం తో తన గతాన్ని పంచుకుంటుంది రమ. అనాధ శరణాలయం లో కష్టాలు, విజయుడి స్నేహం, ఎడబాటు, మరో మోసగాడి బారిన చిక్కిన వైనం, చివరికి ముసిల్దాని ఆశ్రయం పొందడం వరకూ ఏదీ దాచకుండా చెబుతుంది రమ. ఆమె కథ విని కరిగిపోతాడు జగన్నాధం.. ఆమెని వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిశ్చింతగా నిద్రపోతుంది రమ. గదిలో మాటల్ని బయటినుంచి వింటుంది ముసిల్ది. జగన్నాధాన్ని బయటికి పిలిచి మాట్లాడుతుంది.. ఫలితం..అతను అప్పటికప్పుడే పెట్టె తీసుకుని బయటకు నడుస్తాడు.. తర్వాత ఏం జరిగిందన్నది కదిలించే ముగింపు. తిలక్ కథలన్నింటిలోనూ నాకు ఈ కథంటే ప్రత్యేకమైన ఇష్టం.